సమాధి పొందే సమయం
సమాధి పొందే సమయం
కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచి, ఈ విషయమై తన భక్తులందరికీ కాల జ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.
కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది...
“మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత తత్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన, నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.
నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడిచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.
నేను వచ్చే సమయానికి ఈ కళియుగం లోకంలో, ఎర్ర బొయీలు – శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులతో స్నేహం పొంది, భరతఖండం పాలిస్తారు.
హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి. ధనమధాందతచే సాధువులను, జ్ఞానులను, దూషణ చేస్తారు. భూమిపై వర్షములు కురిసినట్లుగానే వుంటాయి. కానీ పంటలు పండవు. పైరులు పండినట్లుగానే వుంటాయి. కానీ నిలవవు. బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.
“శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు.
శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో, దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.
నేను సమాధి విడిచి విష్ణు అంశతో కల్కి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.
అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి.
కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి.
ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.
రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను.
దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.
నా భక్తులయిన వారును సదా నమ్మి ఓం, హ్రీం, క్ల్రీం, శ్రీం, శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’
పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారు, తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే, మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు. ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా, చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.
“నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి, కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.
ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో. నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, భవిష్యత్, వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానో, ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.
ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయో, అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి. నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు. ఈతడు ఒక క్షత్రియుని ఇంట పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.