శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట
శ్రీ స్వామి వారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధ చేయుట
నేను శ్రీ వీర భోజుండనయి ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను. ఈలోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను.
ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటంవల్ల 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.
నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.
దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.
5972సంవత్సరం ధాత నామ సంవత్సరం మాఘ శుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.
జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.
కోమటి కులంలో 25గోత్రముల వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరు మీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశ విదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.
మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
దక్షిణ ప్రాంతంలో అయిదు తలల మేకపోతు పుడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది.
ఇలాంటి వింతలూ ఇప్పటికే అనేకం జరిగాయి. పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టడం, ఇతర అనేక జంతువులు వికృత రూపంతో పుట్టడం ఎన్నోసార్లు వార్తల్లో విన్నాం.
బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.
గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు.
గోలకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.
మహానంది మరుగున మహిమలు పుడతాయి.
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించినవారిని నేను కాపాడుతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీర భోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు. మూఢులుమాత్రం నమ్ముతారు.
మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్నమంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.
“కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.
ఆవు కడుపులోని దూడ పుట్టకుముందే బయటి ప్రజలకు కన్పిస్తుంది.
పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
కృష్ణ, గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా, అన్నిమతాలనూ గౌరవిస్తూ, గుళ్ళూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతారు.
కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహాత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వావీ వరుసలు పాటించరు. ఆచారాలు అన్నీ సమసిపోతాయి.
రాయలవారి సింహాసనం కంపిస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక రకాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు. స్త్రీ పురుషులంతా దురాచారులు అవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.
విజయనగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతి విగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది...'' ఇలా స్వామివారు కడప నవాబుకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.
ఆయన అక్కడినుంచి బయలుదేరి పొద్దుటూరు మీదుగా అల్లాటపల్లె చేరారు. అక్కడ వీరభద్రాలయంలో పూజలు చేయించి బయలుదేరారు. సిద్ధయ్య, మిగిలిన శిష్యులు వెంట రాగా నెమ్మదిగా వెళ్తున్నారు.
ఇదే మార్గంలో అరణ్యంలో తొమ్మిదిమంది దొంగలు, దారిన పోయే బాటసారులను కొల్లగొడుతూ, హతమారుస్తూ వుండేవారు. అందువల్ల ఆ మార్గంలో ప్రయాణించేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ మార్గంలోనే బ్రహ్మంగారు ప్రయాణించడం మొదలుపెట్టారు.
సిద్ధయ్యతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వస్తున్న స్వామివారి బండిని ఆ తొమ్మిది మంది దొంగలు ఆపారు. వారిని చూసి బండితోలే వ్యక్తి భయపడిపోయి, బండిని ఆపేశాడు.
కర్రలు ఎత్తి స్వామివారి పైకి పోయిన దొంగలు స్వామి వారి దృష్టి పడటంతోటే ఎత్తిన చేతులు ఎత్తినట్లే వుండిపోయారు. మాట్లాడదామంటే మాటలు కూడా రావటం ఆగిపోయాయి. అలాగే రాతి మనుషుల్లాగా వుండిపోయారు.
అది చూచి వీరబ్రహ్మంగారు బండి దిగి, వారందరినీ తీసుకురమ్మని సిద్ధయకు చెప్పారు. వెంటనే సిద్ధయ్య అందరినీ నెట్టుకుంటూ స్వామి వారి వద్దకు చేర్చాడు. స్వామివారు దొంగలందరిని స్వయంగా తాకి , వారి చేతులను కిందికి దించారు.
“నన్ను కొట్టి ఈ బండిలో వున్నధనాన్ని తీసుకోండి" అన్నారు.
జవాబు చెబుదామనుకున్నారు గానీ వారికి నోట మాట రాలేదు.
స్వామివారు కొంత విభూతి వారి నోటిలో వేశారు. అయినా వారు శరీరాన్ని కదపలేక పోయారు. పశ్చాత్తాప పడిన దొంగలు స్వామిని ప్రార్థించారు. దాంతో స్వామి వారిని క్షమించి వదిలివేశారు. స్వామివారు అక్కడినుంచి బయలుదేరి, పుష్పగిరి అగ్రహారం చేరారు.