అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం
అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం
వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు.
ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.
రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు.
ఇక్కడ రాజులు అంటే, పాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.
శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు.
నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.
పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది..
మొదట తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరవులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది.
పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులంవారు, ఆ కులవ్రుత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికీ ఏ పని ఇష్టమైతే, ఆ పనిలో స్థిరపడుతున్నారు.
చోళ మండలం నష్టమైపోతుంది..
తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణంవల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది. పందికి కోడి పుడుతుంది..
ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫొటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాలవల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు.
వావీవరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది..
తండ్రీకొడుకులు ఒకర్నొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కధలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కధనం ఆమధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నాం. కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్కే.
శిలలు కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చినవాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు.
ప్రజలు కొరువులు (సిగరెట్లు, బీడీలు కావచ్చు) నోట కరచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.
చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆడా మగా తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుసా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే, అగ్ని పర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ళ కిందట చెప్పటం ఆశ్చర్యకరంగా ఉంది.
జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాలపాలయి జనులు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి.
పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ, కాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం.
అణు బాంబుల వల్ల అణు ధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ కాన్సర్ , ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణు ధూళి చూపించే ప్రభావం వల్లే. అణు బాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తమ్మీద ఇక్కడ చెప్పినవి అన్నీ అణు బాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్ధం చేసుకోవచ్చు.
దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.
లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్ళు, మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు. మనదేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం.
ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది.
మత కలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు...
దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్ లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయడంతో, హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతోంది.
అడవి మృగాలు అడవులలో నుంచి గ్రామాలు, పట్టణాల లోకి ప్రవేశిస్తాయి.. మానవులను చంపుతాయి...
పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి, వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు..
బ్రహ్మంగారు పుట్టి, జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటినుంచే విద్యుత్తు వస్తోంది.ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం.
సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తుచేసుకుందాం. షిర్డీ సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. వివరంగా చెప్పాలంటే..
సాయిబాబాకు రోజూ వ్యాపారులు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒకరోజు ''ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకివ్వాలి?'' అనుకుని వ్యాపారులు తమవద్ద నూనె లేదన్నారు. దాంతో సాయిబాబా తిరిగివచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది.
విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు..
మరీ ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీసువారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. భారతీయుల్లో సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మనదేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఎన్నడో ఊహించారు.
మాచర్ల లోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు..
పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా! నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు స్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది హతమారిపోయారు.
పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు.. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు. అమెరికా సేనలను భయకంపితులను చేశాయి.
ఒకరి భార్యను మరొకరు వశపరచుకుంటారు. స్త్రీ, పురుషులు కామంచేత పీడితులవుతారు.
ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషుల్లో కామ వాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి.
వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు..
ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలయింది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి.. అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి.
మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేశారు. గుజరాత్ లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు.
ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది..
ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమై పోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగానది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.
ఇది ఇప్పటివరకూ జరగలేదు కానీ, ఇకముందు జరిగే అవకాశం ఉంది.
ప్రపంచంలో ఇకముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది.
దీనికి సాక్ష్యాలు, నిదర్శనాలు అక్కరలేదు కదా! కళ్ళముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటే, న్యాయం, ధర్మం ఒంటి కాలిమీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసం, ద్వేషం రాజ్యమేలుతున్నాయి.
క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు.
దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.
విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.
ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి, అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు.
మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.
వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.
కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను.
కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.
తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది.
ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.
ఇలా వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై, జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభం అయింది.
అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు, భక్తులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు.