అచ్చమ్మ - ప్రశ్నలు
అచ్చమ్మ - ప్రశ్నలు
ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి'కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి. వాటిలో కొన్ని....
పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.
దేవుని తెలుసుకోవడం ఎలా?
దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.
దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా?
పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.
ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.
తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.
వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు. అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు. అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.
వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4,5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు. ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని, స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.
వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.